హైదరాబాద్లో మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావుతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరను భక్తులు సురక్షితంగా, సౌకర్యంగా దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, వైద్య సేవలు, శానిటేషన్, విద్యుత్, రహదారి, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, అగ్నిమాపక భద్రత, అత్యవసర సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని మంత్రులు స్పష్టం చేశారు. జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని వనరులు సమకూరుస్తుందని వారు భరోసా ఇచ్చారు.
