సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ మంత్రి శ్రీ రాంప్రసాద్రెడ్డి తెలిపారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్సు చార్జీలను పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.
సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించి, జాగ్రత్తగా తమ సొంతూళ్లకు చేరుకోవాలని మంత్రి సూచించారు. అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని కోరారు.
అదే సమయంలో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేసే ట్రావెల్స్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక చార్జీలు వసూలు చేస్తే సంబంధిత బస్సులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఎవరైనా ఇలాంటి అక్రమ వసూళ్లను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని మంత్రి కోరారు. ప్రభుత్వం ప్రజల సౌకర్యం, భద్రతకే అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని రాంప్రసాద్రెడ్డి తెలిపారు.
