సంక్రాంతి పండుగ రద్దీతో స్తంభించిన హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగరాల నుంచి పల్లెలకు ప్రజలు భారీగా తరలివెళ్లడంతో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా సమీపంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ప్లాజా నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంక్రాంతి, భోగి, కనుమ పండుగలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోళ్ల పందాలను తిలకించేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఏపీకి తరలివెళ్తున్నారు. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతూ, పలు టోల్‌ప్లాజాల వద్ద కార్లు, బస్సులు, లారీలు బారులు తీరాయి. ఈ ఏడాది గత సంవత్సరాలతో పోలిస్తే రికార్డు స్థాయిలో ప్రజలు తమ సొంతూళ్లకు ప్రయాణిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే ఏపీకి భారీగా వాహనాలు చేరడంతో ప్రధాన రహదారులు రష్‌తో నిండిపోయాయి. నగరాల నుంచి పల్లెబాట పట్టిన జనంతో జాతీయ రహదారులు పూర్తిగా కిక్కిరిసిపోయాయి.

WhatsApp Join Now
Youtube Subscribe