- మనమిత్రా సేవలు మరింత పెంచాలి
- ప్రతి సచివాలయం ఒక ఆదర్శ సేవా కేంద్రంగా మారాలి
- సేవల పంపిణీలో పారదర్శకత పాటించాలి
- కురుపాం సచివాలయం ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్ వెల్లడి
పార్వతీపురం జిల్లా ప్రతినిధి జనవరి 30(ఎల్లో సింగం)
సచివాలయ వ్యవస్థ పనితీరును మరింత మెరుగుపడాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా ఎన్.ప్రభాకర రెడ్డి హితవు పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కురుపాం సచివాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కొందరు సిబ్బంది ఆన్ లైన్ లో హాజరు వేయకపోవడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది విధిగా ఆన్లైన్ హాజరు వేయాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు సేవలు అందించడంలో అలసత్వం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. మనమిత్ర గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, ఆ సేవలు మరింత విస్తృతం చేయాలని ఆదేశించారు. ప్రతి ఉద్యోగి నిర్ణీత సమయానికి కార్యాలయానికి చేరుకోవాలని, ఆన్లైన్లో హాజరు నమోదు చేయని పక్షంలో ఆ రోజును సెలవు గా పరిగణించడమే కాకుండా, సంబంధిత సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మండల, జిల్లా స్థాయి అధికారులు ఇకపై నిరంతరం సచివాలయాలను సందర్శిస్తారని, అటెండెన్స్ రిజిస్టర్లు, ఆన్లైన్ లాగిన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు.సచివాలయాల ద్వారా అందుతున్న పౌర సేవలను మరింత విస్తరించాలని అన్నారు. మిత్ర సేవలను పెంచడం ద్వారా ప్రజలు చిన్న చిన్న పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా, స్థానికంగానే పనులు పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలిని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, సేవల పంపిణీలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు సేవలను ఇంటి చెంతకే చేరవేయడం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని సహించేది లేదని, ప్రతి సచివాలయం ఒక ఆదర్శ సేవా కేంద్రంగా మారాలన్నారు.ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాధ్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
