పదో తరగతి విద్యార్థులందరిని సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలతో అనుసంధానం చేయాలి
కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లో సింగం
కొత్తగూడెం.జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పదో తరగతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంపు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పెంపు, పాఠశాలల్లో త్రాగునీటి, మరుగుదొడ్ల సౌకర్యాల మెరుగుదల తదితర అంశాలపై బుధవారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి అదనపు కలెక్టరు డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మితో కలిసి ఎంఈఓలు, ఏపీఎంలు, సంబంధిత శాఖల అధికారులతో జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత విద్యా సంవత్సరపు ఫలితాల విశ్లేషణలో గణితం, సైన్స్, తెలుగు విషయాలలో విద్యార్థులు వెనుకబడినట్టు గమనించామని తెలిపారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రీ-ఫైనల్ పరీక్షల ఫలితాల ఆధారంగా చదువులో వెనుకబడిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు రెండు రోజుల్లో గుర్తించి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో మహిళా సమాఖ్య సభ్యులు కూడా విద్యార్థుల విజయంలో భాగస్వాములు కావాలని, అవసరమైతే వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపారు . సాయంత్రం నిర్వహించే స్టడీ అవర్స్ను విఓఏ లు పర్యవేక్షించాలని సూచించారు. ఆకాంక్షిత విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రశ్నాపత్రాలు, పాఠ్యసామగ్రిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధం చేసి అందించాలని తెలిపారు. బాలికలతో పోలిస్తే బాలుర ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో వారి హాజరు శాతం పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలోని ప్రతి పదో తరగతి విద్యార్థిని సమీప ప్రభుత్వ జూనియర్ కళాశాలతో అనుసంధానం చేయాలని, అందుబాటులో ఉన్న కోర్సులు, సౌకర్యాల వివరాలతో కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. పేద కుటుంబాల విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే ప్రవేశాలు పొందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో త్రాగునీటి సౌకర్యాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకొని అవసరమైన మరమ్మత్తులు తక్షణమే పూర్తి చేయాలని అన్నారు . పదో తరగతి పరీక్షల ప్రారంభానికి ముందే అన్ని ఉన్నత పాఠశాలల్లో త్రాగునీటి సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన వివరాలను నివేదికల రూపంలో సమర్పించాలని ఆదేశించారు. బాలికల మరుగుదొడ్లు లేని పాఠశాలలు ఏవీ ఉండకూడదని స్పష్టం చేస్తూ త్రాగునీటి, మరుగుదొడ్ల మరమ్మత్తులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా 30 సంవత్సరాల లోపు పదో తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణుల వివరాలు, వారు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఉపాధి/వృత్తి సమాచారంతో వీఓఏ లు సమగ్ర నివేదిక రూపొందించి సమర్పించాలని సూచించారు. నిరుద్యోగ యువతను గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్, విద్యాశాఖ కోఆర్డినేటర్ సతీష్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
