విద్యార్థులతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం: సి. యశ్వంత్ కుమార్ రెడ్డి

పార్వతీపురం మండలం పెదబొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ‘జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం’ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని, చిన్న వయసులోనే ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం అవసరమని స్పష్టం చేశారు.

పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు నులిపురుగులు ప్రధాన అడ్డంకిగా మారుతాయని, వాటి నిర్మూలన ద్వారా ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మించగలమని పేర్కొన్నారు. అల్బెండజోల్ మాత్రల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించిన జేసీ, స్వయంగా విద్యార్థులకు మాత్రలు వేసి ఆదర్శంగా నిలిచారు. నులిపురుగుల వల్ల రక్తహీనత, చదువుపై ఏకాగ్రత లోపం వంటి సమస్యలు తలెత్తుతాయని, ఈ మాత్రలతో వాటిని సమర్థంగా అరికట్టవచ్చని తెలిపారు.

పరిశుభ్రత పాటించడం, బహిరంగ మల విసర్జనకు దూరంగా ఉండడం, భోజనం ముందు మరియు తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటి అలవాట్లు ఆరోగ్య రక్షణకు ఎంతగానో దోహదపడతాయని సూచించారు. జిల్లాలో 1 నుండి 19 ఏళ్ల లోపు పిల్లలందరికీ, బడి బయట ఉన్న పిల్లలకు కూడా మాత్రలు అందేలా అధికారులు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. భాస్కరరావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. విజయ్ మోహన్, ప్రోగ్రాం మేనేజర్ డా. టి. జగన్మోహనరావు, మండల విద్యా శాఖాధికారి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Youtube Subscribe