తన కెరీర్పై స్పష్టమైన దృక్పథంతో ముందుకెళ్తున్న కథానాయిక శివానీ నాగరం, వరుసగా సినిమాలు చేయాలనే ఒత్తిడికి తలొగ్గనని చెప్పారు. ప్రేక్షకులు ఇచ్చిన విలువను నిలబెట్టుకోవడమే తనకు ముఖ్యమని, సంఖ్య కంటే నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో సుహాస్తో కలిసి నటించిన ‘హే బలవంత్’ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల కానుండగా, ఈ సందర్భంగా ఆమె తన ఆలోచనలు పంచుకున్నారు.
ఈ చిత్రంలో తన పాత్ర అమాయకత్వంతో పాటు వినోదాన్ని పంచుతుందని, నరేష్, వెన్నెల కిశోర్ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్లో సర్ప్రైజ్ అంశం ఉంటుందని, చివర్లో తండ్రీ–కొడుకుల మధ్య భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని తెలిపారు.
కూచిపూడి, సంగీతంలో శిక్షణ పొందిన శివానీ, సింగర్గా ప్రారంభమై యాక్టర్గా మారిన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. అవకాశాలు వస్తే పాటలు పాడటానికి సిద్ధమని, కుటుంబం నుంచి లభించిన మద్దతు తనకు బలం అని చెప్పారు. స్టార్ హీరోలతో అవకాశమొచ్చినా కథ, పాత్ర నచ్చితేనే అంగీకరిస్తానని స్పష్టం చేశారు.
‘వరుసగా సినిమాలు చేయకపోతే కనిపించకుండా పోతావు’ అనే హెచ్చరికలు వచ్చినా, మంచి కథలనే ఎంపిక చేసుకుంటానని ఆమె ధైర్యంగా చెప్పారు. రొమాంటిక్ కామెడీ జానర్పై ఆసక్తి ఉన్నట్లు తెలిపిన శివానీ, ఓటీటీ ద్వారా ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని, ప్రస్తుతం తమిళంలో రెండు, తెలుగులో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయని వెల్లడించారు.
