కోకో, జీడిపప్పు, కొబ్బరి సాగును ప్రోత్సహించే విధంగా ప్రత్యేక పథకాన్ని తీసుకు రావటం ఏలూరు జిల్లా రైతులకు ప్రయోజనకరం.
ఏలూరు జిల్లా ఎల్లో సింగం
కేంద్ర బడ్జెట్ అత్యుత్తమంగా ఉందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంటులో బడ్జెట్ 2026- 27 ప్రవేశపెట్టిన అనంతరం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ, మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధి, విద్యారంగాలకు సంబంధించి స్పష్టమైన నిధుల కేటాయింపులు చేయటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి సంబంధించి పలు కీలక ప్రకటనలను చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా, ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి బడ్జెట్లో రూ.1,128.91 కోట్ల కేటాయింపు, అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ నిధుల ద్వారా రూ.432.09 కోట్లు, ఏపీలోని పట్టణ ప్రాంతాల కోసం రూ.800 కోట్లు, ఏపీ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు, రహదారులు, వంతెనల పునర్నిర్మాణ పనుల నిమిత్తం రూ.350 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహకంగా రూ.155.32 కోట్లు కేటాయించటం పట్ల ఎంపీ సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలోని ప్రముఖ ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలకు పరిశోధనా గ్రాంట్లను ప్రకటించటాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రకటించారు. అరకు, పులికాట్ ప్రాంతాల్లో ఎకో టూరిజంను డెవలప్ చేయనున్నట్లు ప్రకటించటంతో పాటు, పర్యాటక గైడ్లకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటింటం వల్ల ఆయా ప్రాంతాలలోనే యువతకు ఉపాధి లభించటమే కాకుండా, పర్యాటకులు పెరిగితే ఈ ప్రాంతాల్లోని గిరిజన ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభిస్తుందని, హోమ్స్టేలు, గైడింగ్, ట్రాన్స్పోర్ట్ రంగాల్లో ఉద్యోగాలు పెరగడానికి కేంద్రం నిర్ణయాలు దోహదపడతాయనీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు.ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పటమే కాకుండా, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించిన రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఉండటంతో రాష్ట్రంలో ఖనిజ ఆధారిత పరిశ్రమలకు బూస్ట్ ఇస్తుందన్నారు. హైస్పీడ్ రైల్ కారిడార్లుతో ఆంధ్ర ప్రదేశ్ కు లాభం చేకూరుతుందని చెప్పారు. కోకో, జీడిపప్పుతో పాటు కొబ్బరి సాగును ప్రోత్సహించే విధంగా ప్రత్యేక పథకాన్ని తీసుకు రావటం ఈ పంటలు ఎక్కువగా పండిస్తున్న ఏలూరు జిల్లాలోని రైతాంగానికి ప్రయోజనం చేకూరుస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.
