మార్కెట్లో అరటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం పులివెందుల మార్కెట్లో టన్ను అరటి గరిష్టంగా 16 నుంచి 17 వేల రూపాయలకు అమ్ముడవుతోంది. నాణ్యత లేని బనానా టన్నుకి 10 వేల ధర పలుకుతోంది. ఈ ఏడాది మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అరటి సాగు భారీగా పెరిగింది. మంచి వర్షాలు పడటంతో.. దిగుబడి కూడా బాగా వచ్చింది. ఈ పరిస్థితుల్లో రాయలసీమ అరటికి డిమాండ్ తగ్గిపోయింది. నెల రోజుల క్రితం రాయలసీమలో అరటి ధర కిలో 8 నుంచి 10 రూపాయలు దాటలేదు. లో క్వాలిటీ పండ్ల రేటు కిలో 2 రూపాయల స్థాయికి పడిపోయింది.
అరటి ధరలు భారీగా పతనం కావడంతో.. సీఎం చంద్రబాబు రైతుల సమస్యపై దృష్టిపెట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ అధికారులు.. ఉత్తరాదికి వెళ్లి అక్కడి వ్యాపారులతో చర్చలు జరిపారు. రాష్ట్ర అధికారుల చర్చలు ఫలించడంతో.. నార్త్ ట్రేడర్స్ ఏపీ అరటి కొనడానికి అంగీకరించారు. డిసెంబర్ రెండో వారం నుంచి రాయలసీమ జిల్లాల నుంచి ఉత్తరాదికి అరటి ఎగుమతులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 3 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో అరటి పంట సాగు చేస్తున్నారు. మొత్తం 87 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా.
ఏపీలో పండిన అరటిలో చాలా వరకు రాష్ట్రంలోనే వినియోగం అవుతుంది. మొత్తం దిగుబడిలో 2 లక్షల టన్నులు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉత్తరాదిలో సప్లయ్ ఎక్కువగా ఉండటంతో.. మన దగ్గర డిమాండ్ తగ్గింది. నవంబర్లో ధరలు పడిపోయిన తర్వాత.. ఇప్పటి వరకు 70 వేల టన్నుల అరటి కొనుగోళ్లు జరిగాయి. రానున్న రోజుల్లో అరటి ధరలు మరింత పెరుగుతాయని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రేట్లు పడిపోయినప్పుడు పులివెందులలో ఆందోళన చేసిన వైసీపీ అధినేత జగన్రెడ్డి.. ప్రస్తుతం రైతులకు మంచి ధర దొరుకుతున్న సమయంలో సైలెంట్గా ఉన్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మాత్రం రాజకీయాల కంటే.. రైతుల సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టింది. సర్కారు తీసుకున్న చర్యలు ఫలించడంతో.. అరటి రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర లభిస్తోంది.
