-చిట్వేల్ పాఠశాలలో క్యాడెట్లకు సైబర్ మరియు మొబైల్ సెక్యూరిటీపై అవగాహన
-డిజిటల్ మోసాల బారిన పడొద్దు.. ప్రజలను చైతన్యపరచడమే లక్ష్యంగా క్యాడెట్ల ప్రతిజ్ఞ
-సోషల్ మీడియా దుర్వినియోగంపై యువత అప్రమత్తంగా ఉండాలి: ప్రధానోపాధ్యాయులు దుర్గరాజు
చిట్వేల్, ఫిబ్రవరి 02: ఎల్లో సింగం ప్రతినిధి
డిజిటల్ యుగంలో రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని చిట్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్సీసీ ట్రూప్ కమాండర్ పసుపుల రాజశేఖర్ పిలుపునిచ్చారు. క్యాడెట్లకు శిక్షణలో భాగంగా సోమవారం పాఠశాల ఆవరణలో సైబర్ మరియు మొబైల్ సెక్యూరిటీపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
-ఆన్లైన్ మోసాలపై అవగాహన:
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం పెరగడంతో పాటు ఫిషింగ్ లింకులు, నకిలీ కాల్స్, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలు పెచ్చరిల్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్లను సురక్షితంగా ఎలా వినియోగించాలి, బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచితులకు ఓటీపీలు పంచుకోకూడదని క్యాడెట్లకు సూచించారు.
-యువత బాధ్యత – ప్రతిజ్ఞ:
సైబర్ భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్సీసీ క్యాడెట్లు సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు దుర్గరాజుతో కలిసి క్యాడెట్లు సైబర్ మోసాల నుంచి ప్రజలను రక్షించేందుకు మరియు ఇతరులను చైతన్యపరిచేందుకు గట్టిగా ప్రతిజ్ఞ చేశారు.
-శిక్షణలో కీలకం:
ఈ కార్యక్రమం ద్వారా క్యాడెట్లకు సైబర్ నేరాల రకాలు, వాటిని ఎలా గుర్తించాలి, మోసపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి అనే అంశాలపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్సీసీ క్యాడెట్లు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
