విశాఖపట్నం గోపాలపట్నం ప్రాంతంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, బి ఆర్ టి ఎస్ రోడ్డు మార్గం మధ్యలో నాటిన మొక్కలకు నీటి సంరక్షణ ఏర్పాట్లు చేశారు. ప్లాస్టిక్ బాటిళ్లను కట్ చేసి భూమిలో ప్రత్యేక విధానంలో అమర్చడం ద్వారా నీరు వృథా కాకుండా నేరుగా మొక్కల వేరుల వద్దకు చేరేలా సదుపాయం కల్పించారు.
ఈ విధానం వల్ల తక్కువ నీటితో ఎక్కువ ప్రయోజనం లభించడంతో పాటు, మొక్కలు ఆరోగ్యంగా, ఏపుగా పెరుగుతాయని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. త్వరలో మిగిలిన మొక్కలకు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో చంద్రానగర్ గ్రౌండ్లో నాటిన మొక్కలకు ఇలాంటి నీటి సంరక్షణ చర్యలు చేపట్టిన విషయం గుర్తుచేశారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా జేడీ ఫౌండేషన్ తీసుకుంటున్న ఈ వినూత్న చర్యలకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు.
