మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖశాంతులతో, సుభిక్షంగా జీవించాలని ఆ పరమశివుడిని ప్రార్థిస్తూ, ఈ పవిత్ర దినం ఆధ్యాత్మిక చైతన్యాన్ని, ధార్మిక విలువలను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. సహనానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచిన ఉమామహేశ్వరుడు హిందూ భక్తుల ఆరాధ్యదైవమని, భక్తిశ్రద్ధలతో కొలిచే ప్రతి భక్తుని కోరికలను తీర్చే ‘భోళా శంకరుడు’గా పరమశివునికి భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉందని ఆయన అన్నారు.
సృష్టి మనుగడ కోసం గరళాన్ని మింగిన మహాత్యాగి, ఆదియోగి, గరళకంఠుడు అయిన పరమేశ్వరుడు సమస్త ప్రాణికోటికి రక్షకుడని కొనియాడారు. రాష్ట్రం మొత్తం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని, శ్రీకాకుళం నియోజకవర్గం మరింత పురోగతి సాధించాలని దేవదేవుడైన చంద్రశేఖరుడి ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్బంగా భక్తులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ, ధర్మం, శాంతి, సౌభ్రాతృత్వం సమాజంలో వెల్లివిరియాలని పిలుపునిచ్చారు.
