తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోవడంతో క్యూలైన్ శిలాతోరణం వరకు విస్తరించింది. సర్వదర్శనం చేసుకునేందుకు సుమారు 15 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.
భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. దర్శనాల నిర్వహణ సజావుగా సాగేందుకు అదనపు సిబ్బందిని నియమించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.05 కోట్లుగా నమోదైంది. వేలాది మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడంతో కళ్యాణకట్టలు కూడా కిటకిటలాడుతున్నాయి.
వసతి, అన్నప్రసాదం, తాగునీరు వంటి సౌకర్యాలను పెంచామని టీటీడీ పేర్కొంది. రద్దీ దృష్ట్యా భక్తులు ముందస్తు దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శనాలను వినియోగించుకోవాలని సూచించింది.
