గుంటూరు నగరంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవిని అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం గుంటూరులోని ఆమె నివాసంలో జరిగిన ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు నేతృత్వం వహించారు.
ఈ సందర్భంగా అవనిగడ్డ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, మహిళా నాయకులు ఎమ్మెల్యే గళ్ళ మాధవికి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. శాలువాతో ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. పరస్పర రాజకీయ, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై స్నేహపూర్వక చర్చలు జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కొల్లూరి ఇమ్మానియేలు, అవనిగడ్డ–మోపిదేవి మాజీ ఎంపీపీలు బండే కనకదుర్గ, మోర్ల జయలక్ష్మి, పార్టీ నేతలు విశ్వనాథపల్లి పాప, మండలి రామమోహనరావు, అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ, ఆంగోతు శాంతి, ఆకుల సీతామహాలక్ష్మి, కొల్లూరి వాసు తదితరులు పాల్గొన్నారు.
