ఇజ్రాయెల్‌ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం కేసు: ముగ్గురికి మరణశిక్ష

కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లాలో సంచలనం సృష్టించిన ఇజ్రాయెల్‌ టూరిస్ట్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో కీలక తీర్పు వెలువడింది. ఇజ్రాయెల్‌కు చెందిన యువతి సహా ఇద్దరు మహిళలపై అత్యాచారం, అలాగే పర్యాటకుడు డిబాస్‌ మృతికి కారణమైన ముగ్గురు నిందితులకు కొప్పళ సెషన్స్‌ కోర్టు మరణశిక్ష విధించింది. సోమవారం ప్రకటించిన ఈ తీర్పు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

గతేడాది మార్చిలో తుంగభద్ర ఎడమ కాలువ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన మహిళ (27), అమెరికాకు చెందిన డేనియల్‌ (23), నాసిక్‌కు చెందిన పంకజ్‌ (43), ఒడిశాకు చెందిన డిబాస్‌ (42) ఆనెగుందిలోని హోంస్టేలో బసచేశారు. రాత్రివేళ సంగీత కార్యక్రమం అనంతరం మద్యంమత్తులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు డబ్బు డిమాండ్‌ చేసి, ఇవ్వకపోవడంతో దాడికి పాల్పడ్డారు.

పర్యాటకులు అడ్డుకోవడంతో నిందితులు డేనియల్‌, పంకజ్‌, డిబాస్‌లను కాలువలోకి తోసి, ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారు. డేనియల్‌, పంకజ్‌లు ఈదుకుంటూ బయటపడగా, డిబాస్‌ మునిగి మృతిచెందారు. కేసులో నిందితులైన మల్లేశ్‌ అలియాస్‌ హండిమళ్ల, సాయి, శరణప్పలను పోలీసులు అరెస్టు చేసి, చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు కఠిన శిక్ష విధించింది.

WhatsApp Join Now
Youtube Subscribe