రాజంపేట జనవరి 20,(ఎల్లో సింగం ప్రతినిధి)
రాజంపేట పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ ఎస్. లక్ష్మీనారాయణ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో నిర్వహిస్తున్న రికార్డులను, రిజిస్టర్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వం ద్వారా చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందవలసిన పోషకాహారం మరియు ఇతర సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న అంశాన్ని కమిషనర్ పర్యవేక్షించారు. చిన్నారులకు అందించే ఆహారం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కేంద్రాల్లో పరిశుభ్రత పాటించాలని, మెనూ ప్రకారం ఆహారం పంపిణీ చేయాలని మరియు హాజరు శాతం పక్కాగా ఉండాలని స్పష్టం చేశారు.
ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, క్షేత్రస్థాయిలో విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు లబ్ధిదారులందరికీ సేవలు అందాలని ఆయన సూచించారు.
